సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ పండుగ, నిమజ్జన వేడుకలను పూర్తి చేసేందుకు స్థానిక పోలీసులు ఇప్పటికే మండపాల నిర్వాహకులతో సభలు, సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలోని పోలీస్ అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు పలు దఫాలుగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు.
మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిమజ్జనానికి వెళ్లే రూట్లకు సంబంధించిన అంశంలో స్థానిక పోలీసులు ఆయా మండపాల నిర్వాహకులతో వివరాలు సేకరించారు. పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి, ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పీస్ కమిటీలు ఉండాలని ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. సోషల్మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని మండపాల నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. ఆయా సెక్టార్లలోన బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది గణేశ్ మండపాల వద్ద నిరంతరం పరిశీలిస్తుండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతతకు భంగం కలుగకుండా చూడాలని అధికారులకు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గణేశ్ పండుగ నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.