Traffic Restrictions | హైదరాబాద్ ట్యాంక్బండ్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, నెక్లెస్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ, కర్బాల మైదాన్, చిల్డ్రన్ పార్క్, రాణిగంజ్రూట్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వాహనదారులకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వెహికల్స్ను షాదన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా దారి మళ్లించనున్నారు. నిరంకారీ భవన్, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ ఓవర్ మీదుగా వాహనాలకు అనుమతి లేదు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ వైపు వాహనాలకు ఎంట్రీ లేదు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బుద్ధ భవన్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ రూట్లో వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా దారి మళ్లిస్తారు.
లిబర్టీ అంబేద్కర్ విగ్రహం, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో వాహనాలకు అనుమతి ఉండదు. వాటిని ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు. రాణిగంజ్, కర్బాల మైదాన్, కవాడిగూడ నుంచి ట్యాంక్బండ్ వైపుగా వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్ రూట్లో దారి మళ్లిస్తారు. బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను రాజ్దూత్ లేన్ మీదుగా మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదని, లోయర్ ట్యాంక్ బండ్ సెయిలింగ్ క్లబ్ వద్ద దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు.