సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): నేటి (శుక్రవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా- ఈ రేస్, 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవం, ఈనెల 3వ వారంలో శివరాత్రి, శివాజీ మహారాజ్ జయంతి, జగ్నేకి రాత్… తదితర పండుగలు, కార్యక్రమాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సీవీ. ఆనంద్ గురువారం కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భద్రతపై పలు సూచనలు చేశారు. రానున్న రోజులు చాలా కీలకమని, ఫార్ములా ఈ రేస్, సచివాలయం ప్రారంభోత్సవం వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంతాల్లో ‘జీరో ఎర్రర్ యాక్సెస్ కంట్రోల్’ (ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా), అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అసెంబ్లీ వద్ద కీలకమైన ప్రదేశాలు, లేన్స్, బైలేన్స్ వద్ద అవసరమైన బలగాలను మోహరించాలని సూచించారు.
ఫార్ములా- ఈ రేసింగ్ నేపథ్యంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలపై సాధారణ ప్రజలకు వివిధ ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ, అవగాహన కల్పించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వదంతులు తలెత్తకుండా సూక్ష్మంగా పర్యవేక్షించాలని సోషల్ మీడి యా మానిటరింగ్ టీమ్స్ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ విశ్వప్రసాద్, అదనపు కమిషనర్ విక్రమ్సింగ్ మాన్, జాయింట్ సీపీ (అడ్మిన్) జె.పరిమళ హన నూతన్, ఐసీసీసీ డీసీపీ డి.సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.