సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపన నేపథ్యంలో ఈనెల 9న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. మాదాపూర్లోని రహేజ, మైండ్ స్పేస్ జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, రాబ్ కేపీహెచ్బీ నుంచి సైబర్ టవర్, హైటెక్స్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగ, నీరస్ జంక్షన్ నుంచి పర్వత్నగర్.. తదితర ప్రాంతాల్లోట్రాఫిక్ ప్రభావం ఉంటుందని డీసీపీ తెలిపారు.