హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. అబిడ్స్లోని జీపీవో సర్కిల్లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అబిడ్స్ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
లిబర్టీ, బషీర్బాగ్ నుంచి బీజేఆర్ సర్కిల్ వైపు వచ్చే వాహనాలను నిలిపివేసి, బీజేఆర్ సర్కిల్ వద్ద ఏఆర్ పెట్రోల్ బంకు వైపు నాంపల్లి స్టేషన్రోడ్డుకు మళ్లిస్తున్నారు. లిబర్టీ నుంచి బీజేఆర్ సర్కిల్ వైపుగా వచ్చే ఆర్టీసీ బస్సులకు అనుమతి నిరాకిస్తూ.. లిబర్టీ వద్ద హిమాయత్నగర్, నారాయణగూడ, కాచిగూడ, కోఠి వైపుగా మళ్లించారు. కింగ్కోఠి నుంచి అబిడ్స్ ప్రధాన రహదారికి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకుండా.. కింగ్ కోఠి క్రాస్రోడ్డు వద్ద హనుమాన్ టెక్డి, తురుప్బజార్, కోఠి వైపుగా మళ్లించారు.
బొగ్గులకుంట నుంచి అబిడ్జ్ రహదారికి వచ్చే వాహనాలను.. బొగ్గులకుంట క్రాస్రోడ్డు వద్ద హనుమాన్ టెక్డి, తురుప్బజార్, కోఠి వైపు.. ఎంజే మార్కెట్, జాంబాగ్ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకుండా.. ఎంజేమార్కెట్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించారు. పీసీఆర్ నుంచి జేబీఆర్ సర్కిల్ వైపుగా వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంకు వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ఆయా మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.