సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ) : ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి, రోడ్ల మధ్య కన్టెకివిటీకి కేసీఅర్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున మిస్సింగ్ లింకులు, స్లిప్ రోడ్లను అభివృద్ధి చేసింది. దూరాభారాన్ని తగ్గించి ప్రయాణికులకు నిర్దేశిత సమయంలో సాఫీగా ప్రయాణం సాగేలా హైదరాబాద్ రోడ్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) విభాగాన్ని ఏర్పాటు చేసి మూడు దశల్లో 137 రోడ్లను అభివృద్ధి చేసింది. తొలి విడతలో 24 కిలోమీటర్ల మేరలో 21 రోడ్లను చేపట్టి అందుబాటులోకి తీసుకురాగా..రెండో విడతలో రూ. 215 కోట్లతో 20 కిలోమీటర్ల మేర 11 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే యూసుఫ్గూడ చెక్పోస్టు రోడ్డు (జూబ్లీహిల్స్ రోడ్ నం.5), కృష్ణానగర్ నుంచి కేబీఆర్ పార్కు రోడ్డు (బంజారాహిల్స్ రోడ్డు నం 2) కలుపుతూ చేపడుతున్న లింకు రోడ్డు పనుల్లో కీలక ఘట్టం పూర్తి చేసుకుంది.
అన్నపూర్ణ స్టూడియో వద్దనున్న గుట్టను పూర్తిగా తొలిచి లింకు రోడ్డుకు పూర్తి లైన్ క్లియర్ చేశారు. ఈ గుట్ట మధ్య నుంచి మీదుగా బంజారాహిల్స్ రోడ్ నం.2ను కలుపుతున్నారు. 250 మీటర్ల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రూ. 2.40 కోట్లతో పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ లింకు రోడ్డు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ లింకు రోడ్డుతో యూసుఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మహా ఉపశమనం లభించనుంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరాభారం తగ్గనుంది. అన్నిటి కంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత చెక్ పడనుంది.