అంబర్పేట, జూన్ 23: ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ లేని వాణిజ్య సముదాయాల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొనేలా జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డీసీ వేణుగోపాల్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సర్కిల్ పరిధిలోని హిమాయత్నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్లలో ఉన్న వ్యాపారుల వద్దకు వెళ్లి ట్రేడ్ లైసెన్స్ ను పరిశీలిస్తున్నారు. లైసెన్స్ లేని వారిని తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా లైసెన్స్కు దరఖాస్తు చేసుకొని దాని ద్వారానే లైసెన్స్ ఫీజు కట్టించుకుంటున్నారు.
20 ప్రత్యేక బృందాలు..
ఫీజు వసూలు చేసేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో నాలుగు నుంచి ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ బృందాలను పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ ఉన్నారు. ఈ బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి వ్యాపార సంస్థ దగ్గరకు వెళ్లి వారికి ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేదా? అని ఆరా తీస్తున్నారు. లైసెన్స్ లేకుంటే యాప్ ద్వారా దరఖాస్తు చేయిస్తున్నారు. ఇలా సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు అధికారులు, సిబ్బంది వెళ్తున్నారు.
పదివేల వరకు ఉన్నట్లు అంచనా…
సర్కిల్ పరిధిలో ఇంకా ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వ్యాపార, వాణిజ్య సంస్థలు పదివేల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రతి దుకాణం దగ్గరకు వెళ్లి ట్రేడ్ లైసెన్స్ లేకుంటే వారందరిని లైసెన్స్ పరిధిలోకి తీసురావడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు.
సద్వినియోగం చేసుకోండి
ఇప్పటి వరకు ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదో వారందరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. మా బృందాలు దుకాణం దగ్గరకే వస్తున్నారు. వారిని అడిగి ఆన్లైన్లో ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించాలి. అందరూ సద్వినియోగం చేసుకోండి.
-వేణుగోపాల్, డిప్యూటీ కమిషనర్