Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు దీర్ఘకాలిక లీజు కాంట్రాక్టు కోసం 4 సంస్థలు పోటీ పడ్డాయి. ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)ని తీసుకువచ్చింది. గతేడాది కాలంగా దీనిపై కసరత్తు చేసిన హెచ్ఎండీఏ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. మార్చి నెలాఖరుకు టెండర్ గడువు ముగిసిన తర్వాత మొత్తం 4 కంపెనీలు తమ బిడ్లను దాఖలు చేయాలని అధికారులు తెలిపారు. బిడ్లు దాఖలు చేసిన కంపెనీలకు సంబంధించిన సాంకేతిక అంశాల పరిశీలన పూర్తికాగా, ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారులు అధ్యయనం చేస్తున్నారని, అన్ని అర్హతలు ఉన్న కంపెనీని గుర్తించి, ఎక్కువ కోట్ చేసిన కంపెనీకి ఓఆర్ఆర్ టీవోటీని అప్పగించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ నిధులతో గ్రేటర్ చుట్టూ భారీ ప్రాజెక్టులు
హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డును దీర్ఘ కాలిక లీజుకు ఇవ్వడంతో ఒకేసారి రూ.7వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులను హైదరాబాద్ చుట్టు పక్కల భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు వెచ్చించనున్నారు. ఇప్పటికే గ్రేటర్ చుట్టూ రూ.6,696కోట్లు వెచ్చించి ఎనిమిది లైన్లతో 158 కిలోమీటర్లతో కూడిన ఔటర్ రింగు రోడ్డు మార్గానికి హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. 19 ఇంటర్ఛేంజ్లు ఉన్న ఓఆర్ఆర్పై ప్రతి రోజు 1.90 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
దీనిద్వారా గత వార్షిక సంవత్సరం (2021-22) ప్రతి రోజు రూ.1.16 కోట్లు ఆదాయం రాగా, నెలకు రూ.35 కోట్ల చొప్పున ఏడాదికి రూ.420 కోట్ల వరకు టోల్ రూపంలో ఆదాయం వస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో దీన్ని పరిగణలోకి టీవోటీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇలా వచ్చే నిధులను ముందే ఏజెన్సీ నుంచి తీసుకొని ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్న కోర్ సిటీ నుంచి 50 కి.మీ దూరం వరకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది.
లీజుకు అప్పగిస్తే ఎన్నో ప్రయోజనాలు
దీర్ఘకాలిక లీజుకు అప్పగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు. ముఖ్యంగా ఓఆర్ఆర్పై ఆస్తులను పర్యవేక్షించడంలో హెచ్ఎండీఏకు భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యం కారణంగా ఓఆర్ఆర్పైన మెరుగైన నిర్వహణ కొనసాగుతుంది. ముఖ్యంగా టోల్ వసూలు, సాధారణ నిర్వహణలో భాగంగా గుంతలు, పగుళ్లు, కాలువలు, జాయింట్ల మరమ్మతులు చేయడం, అవసరమైనప్పుడు టోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సులభంగా జరుగుతుంది. ఇప్పటికే దేశంలో ఇలాంటి విధానం అమల్లో ఉండటంతో హెచ్ఎండీఏ సైతం ఆదిశగా చర్యలు చేపట్టిందని, వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఎక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీని ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు.
టెండర్ దాఖలు చేసిన కంపెనీలు