సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): యువతరమా.. నవతరమా.. ఇదే అదును కదిలిరమ్ము అంటూ..” కొన్నేండ్లుగా వరకట్నం తీసుకోకుండా పెండ్లి చేసుకోవాలని ఐ డోన్ట్ వాంట్ డౌరీ.కామ్ ఆధ్వర్యంలో యువతరాన్ని చైతన్యం చేస్తున్నది. ప్రస్తుత కాలంలో తాము కట్నం లేకుండా వివాహం చేసుకుంటాం అని ధైర్యంగా చెప్పే పెండ్లి కొడుకులు ముందుకు వస్తుండగా.. మరోవైపు కట్నం తీసుకోని వారినే పెండ్లి చేసుకుంటాం అని పెండ్లి కూతుర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన వారందరికీ గత 17 ఏండ్లుగా అద్భుతమైన వేదికగా నిలుస్తున్నది “ఐ డోన్ట్ వాంట్ డౌరీ.కామ్.” ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 60 జంటలు కట్నం తీసుకోకుండానే ఈ వేదికగా ఒక్కటయ్యారని, ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతున్నారని నిర్వాహకుడు సత్య నరేశ్ పేర్కొన్నాడు.
2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు బిర్లా ఆడిటోరియంలో 8సార్లు, రవీంద్ర భారతిలో 6సార్లు, అనంతరం కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ ద్వారా ఆర్గనైజ్ చేసినట్లు నరేశ్ తెలిపాడు. ఇప్పటి వరకు 10వేల మంది వరకు వరకట్నం వద్దనుకునే వారు సభ్యులుగా ఉన్నారని చెప్పాడు. ఆన్లైన్ వేదికగా (డిసెంబర్ 18) ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జూమ్ యాప్ ద్వారా 17వ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు www.IdontwantDowry.com లేదా 98858 10100లో సంప్రదించాలని సూచించారు.
పెండ్లి అనగానే.. పిల్ల మంచిగుందా.. ఏం చదివింది? ఎక్కడ చదివింది? వంటలు వండటం వచ్చా.. ఏదైనా ఉద్యోగం చేస్తుందా.. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత.. చివరకు కట్నం సంగతేంది. ఎంత
ఇచ్చుకుంటారు? అనేది ప్రతి పెండ్లి సంబంధాల విషయంలో తరచూ వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు “కట్నం లేకుండా పెండ్లి చేసుకుంటాం.. కట్నం తీసుకోని వారిని పెండ్లి చేసుకుంటాం” అనే రోజులు వస్తున్నాయి.
సావిత్రిబాయి ఆదర్శం
మా రెండు కుటుంబాలూ సామాజిక ఉద్యమాల నేపథ్యం కలిగి ఉండటం వల్ల కట్నం లేని పెండ్లి సాధ్యమైందని నా నమ్మకం. అయితే కట్నం తీసుకోకపోవడానికి సావిత్రిబాయి ఫూలే, మహత్మా జ్యోతీబా ఫూలే, అంబేద్కర్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవమే. మా తండ్రి సామాజిక ఉద్యమాలవైపు నిలిచాడని లావణ్య.. ‘మా తల్లి పేరు సావిత్రిబాయి. ఆమె స్ఫూర్తితో నేను కట్నం తీసుకోకుండా పెండ్లి చేసుకున్నానని భాస్కర్ పేర్కొన్నాడు. వరకట్నం లేని పెండ్లీల కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న ఐ డోన్ట్ వాంట్ డౌరీ.కామ్ నిర్వాహకులకు అభినందనలు.
– లావణ్య భాస్కర్
వరకట్నం ఓ సామాజిక రుగ్మత
పేద కుటుంబాలను వరకట్నం అనే సామాజిక రుగ్మత ఇప్పటికీ పట్టి పీడిస్తూనే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించేవారేవరూ కట్నం కోరుకోకూడదని విశ్వసిస్తాను. ఆస్తి హక్కును నిరాకరించే క్రమంలోనే వరకట్నం అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. స్త్రీ, పురుషులకు తమ వారసత్వ ఆస్తిలో సమాన హక్కు ఉండాలని కోరుకుంటాను. నేను కట్నం లేకుండా పెండ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రులు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగారు కాబట్టి, కట్నం తీసుకోకుండా పెండ్లి చేసుకుంటాని చెప్పాను. వెంటనే వారు స్వాగతించారు. కట్నం లేకుండా పెండ్లి చేసుకున్నాడని మా ఊరి ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.
– దొంత ప్రశాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అజీంప్రేమ్జీ వర్సిటీ, బెంగళూరు.