సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సాహిత్య సాంస్కృతిక వికాసం మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా కవి, రచయిత, నిత్య అధ్యయనశీలి అయిన సీఎం కేసీఆర్ 2014కు ముందు మూతపడిన సాహిత్య అకాడమీని పునరుద్ధరించారు. చరిత్రపుటల్లో మిగిలిపోయిన సాహితీ మూర్తులను గుర్తిస్తూ..వారి రచనలకు విస్తృతమైన గుర్తింపు తెచ్చారు. 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను సీఎం కేసీఆర్ ఆదేశంతో నిర్వహించి ఎల్లలెరుగని విధంగా సాహితీవేత్తలను గౌరవించుకున్నాం. ఈ నెల 11న ఉదయం 9 నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు రవీంద్రభారతి వేదికగా భాషా సాంస్కృతిక శాఖ-తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్యదినోత్సవం నిర్వహిస్తున్నది. గంగా జమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషలలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహిస్తారు. ఈ కవి సమ్మేళనంలో దాదాపు 150 మంది కవులు పాల్గొంటారు. ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా రూ.లక్షా 116, రెండవ బహుమతిగా రూ.75 వేల 116, మూడో బహుమతిగా రూ.60 వేల 116, నాలుగో బహుమతిగా రూ.50 వేల 116, ఐదో బహుమతిగా రూ.30 వేల 116 అందించనున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులను, సాహితీవేత్తలను సతరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ ఓ సాహితీ వనం ;సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం సమస్త కళలు, సాహిత్యాన్ని రికార్డు చేసే మహత్తర బాధ్యతను సాహిత్య అకాడమీ చేపట్టిందని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్ని జిల్లాల్లో సాహిత్య దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంపై తెలంగాణ కవులు రాసిన కవితలతో సంకలనం రూపొందుతున్నదని వెల్లడించారు. తెలంగాణ సాహిత్య అకాడమీని గిరిజన గడపల దాకా తీసుకెళ్లేందుకు గిరిజనులపై రాసిన బృహత్తర కథల సంకలనం వెలువరించినట్టు తెలిపారు. సావిత్రిబాయి, జ్యోతిబా ఫూలేపై రెండు దీర్ఘ కవితలను అకాడమీ ఆధ్వరంలో తీసుకొచ్చినట్టు చెప్పారు.