సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : చారిత్రక ఘనకీర్తిని కలిగిన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం లాల్దర్వాజా అమ్మవారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పలువురు అధికారులు, ఆలయ పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి రోజు ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
బోనాలకు భారీ బందోబస్తు
భాగ్యనగరం బోనాల ఉత్సవాలకు మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. ముఖ్యంగా పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న, జియాగూడ సబ్జీమంది, కార్వాన్ దర్బార్ మైసమ్మ, గోల్కొండ తదితర చారిత్రాత్మకమైన ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. లాల్దర్వాజ మహంకాళి ఆలయం వద్ద ఆదివారం వీఐపీలు, వీవీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బోనాలు, తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో సాగే విధంగా స్థానిక ఎస్హెచ్వోలు ఇప్పటికే బస్తీ, ఆలయ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. మహానగరంలో శనివారం నుంచే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.