మారేడ్పల్లి, ఆగస్టు 26: సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో గ్లోబల్ ట్రీ సంస్థ అచీవర్స్ డైలాగ్స్ పేరుతో శనివారం యూకే వెళ్లే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ మాట్లాడుతూ….ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండియా నుంచి ప్రతి ఏటా యూకేకు 1.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ టెన్లో యూకేలో విద్య యూనివర్సిటీలు ఉన్నాయని, వాటితో పాటు నేటి యువతకు ఆధునిక విద్యను అందించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సంస్థ ఎండీ శ్రీకర్ మాట్లాడుతూ…యూకే వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహించామని తెలిపారు.