సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నివారణ, పరిశోధనను మరింత పకడ్బందీగా చేయడం కోసం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈఓడబ్ల్యూ)ను మరింత బలోపేతం చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కమిషనరేట్లో అధునాతన సౌకర్యాలతో రెనవేట్ చేసిన ఈఓడబ్ల్యూ కార్యాలయాన్ని శనివారం సీపీ పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక నేరాలు, గొలుసుకట్టు నేరాలు, గుర్తింపులేని చిట్ ఫండ్స్ మోసాలు, వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పరిశోధించచడానికి గాను 2018 జూలైలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విభాగాన్ని ప్రారంభించామని తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈఓడబ్ల్యూ విభాగం పని చేయనుంది. వ్యవస్థీకృత ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన పెంచడానికి కర పత్రాలను సీపీ విడుదల చేశారు.
వీటి ద్వారా ట్రాఫిక్ జంక్షన్లు, బస్ స్టాప్లు తదితర రద్దీ ప్రదేశాల వద్ద పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో వాయిస్ ఓవర్లతో ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, షీ టీమ్స్ డీసీపీ నితికా పంత్, బాలానగర్ డీసీపీ టి. శ్రీనివాసరావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ రితిరాజ్, అడ్మిన్ డీసీపీ యోగేష్ గౌతమ్, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమాల్, ఈఓడబ్ల్యూ డీసీపీ కవిత, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ సందీప్, మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, సీసీఎస్ ఏడీసీపీ నరసింహారెడ్డి, ఏడీసీపీ రవి కుమార్, ఏడీసీపీ సీఎస్డబ్ల్యూ వెంకట్ రెడ్డి, ఇన్చార్జి ఏసీపీ పురుషోత్తమ్, ఈఓడబ్ల్యూ ఇన్స్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.