Water Tanker | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వాటర్ ట్యాంకర్ పొందాలంటే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే..!! భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.. అందుకే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉంది? అయినా సరే ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల్లోగా ఇస్తామంటున్న జలమండలి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం పొంతన లేదని నిరూపించే ఘటన ఇది.. రాజేంద్రనగర్ కిస్మత్పుర ఫిల్లింగ్ స్టేషన్ (జలమండలి ఫిల్లింగ్ పాయింట్) పరిధిలో సబిఉద్దీన్ అనే వ్యక్తి వాటర్ ట్యాంకర్ కోసం ఈ నెల 7వ తేదీన బుక్ చేశాడు. టోకెన్ నంబరు 8509తో బుకింగ్ సమయంలో 40 ట్యాంకర్లు ముందు వెయిటింగ్ జాబితాలో ఉన్నట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. మరుసటి రోజు ట్యాంకర్ వస్తుందని భావించిన సదరు వ్యక్తికి చుక్కెదురైంది. మూడు రోజులు గడిచినా 40లో ఉన్న పెండింగ్ జాబితాలో 24 వరకు వచ్చింది.
దీంతో విస్మయం చెందిన సదరు వ్యక్తి క్యూ కాదని అడ్డదారిలో ట్యాంకర్లు వెళ్తున్నాయా? అంటూ ఎక్స్ వేదికగా జలమండలి పనితీరును తూర్పారబట్టాడు. అధికారులు మాత్రం కిస్మత్పుర ఏరియాలో ఇటీవల కొత్తగా ఫిల్లింగ్ పాయింట్ (కేంద్రాన్ని) ఏర్పాటు చేశామని, కేవలం ఒక ట్యాంకర్ ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రారంభ సమయంలోనే ఉన్నందున పెండింగ్ జాబితా క్లియర్ చేసేందుకు రోజుల సమయం తీసుకుందని చెబుతున్నారు. సబిఉద్దీన్ బుకింగ్ను పూర్తిగా పరిశీలించామని, రోజుకు 5 నుంచి 6 ట్యాంకర్ ట్రిప్పులు మాత్రమే వెళ్తుండడంతోనే ఇబ్బంది వచ్చిందని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ట్యాంకర్ నీటిని అందిస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.