సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): సనత్నగర్ టిమ్స్కు మెంటర్ సెంటర్గా నిమ్స్ను కేటాయించారు. అంటే నిమ్స్ పర్యవేక్షణలో సనత్నగర్ టిమ్స్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జారీచేసిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను నిమ్స్ నుంచి వెలువడినట్లు అధికారులు తెలిపారు. టిమ్స్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిమ్స్ మార్గదర్శకాల ప్రకారం జరగనున్నట్లు సమాచారం.
అంతే కాకుండా ఉస్మానియా, గాంధీ తదితర ప్రభుత్వ దవాఖానల్లా సనత్నగర్ టిమ్స్లో వైద్యసేవలు పూర్తి ఉచితంగా ఉండవని సమాచారం. ఈ హాస్పిటల్లో కూడా నిమ్స్ తరహా చెల్లింపుల ద్వారానే వైద్యసేవలు అందించనున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ కార్డు, జర్నలిస్టుల హెల్త్ కార్డులు మినహా ఇతర అన్ని రకాల ప్రజలకు ఓపీ, ఐపీ, శస్త్రచికిత్సలు తదితర వైద్య సేవలను చెల్లింపుల ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
నిరుపేద రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు మళ్లీ అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నట్లు ప్రజలు వాపోతున్నారు. సాధారణంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఖర్చుతో కూడుకున్నది. వైద్యపరీక్షలు, శస్త్రచికిత్స, మందులు ఇలా ప్రతీది ఖరీదైనదే. అయితే ప్రభుత్వ రంగ పరిధిలో నడిచే నిమ్స్, అందుబాటులోకి రానున్న టిమ్స్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ తదితర స్కీముల కింద అందించే వైద్యసేవలు పూర్తి ఉచితంగా అందడం లేదని, వాటికి పరిమితులు విధించడంతో నిర్ణీత పరిమితి దాటితే మిగిలిన బిల్లులు చేతిద్వారా చెల్లించాల్సి వస్తోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రకాల వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావడం లేదని, దీంతో ఆర్థిక భారం తప్పడంలేదంటున్నారు రోగులు. అంతే కాకుండా ఈ దవాఖానల్లో చాలా వరకు మందులన్ని బయటి నుంచే తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అదే గాంధీ, ఉస్మానియా తరహ పూర్తిస్థాయి ప్రభుత్వ దవాఖానలో అయితే అన్ని వర్గాల ప్రజలకు పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా వైద్యం అందుతుందని జనం అభిప్రాయపడుతున్నారు.