మాదాపూర్, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని, కృష్ణా, గోదావరి నుంచి వందల కిలో మీటర్ల మేర నీటిని తీసుకొచ్చి.. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీరుస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శనివారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్ పో 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ కృష్ణన్, అపర్ణ కన్స్ట్రక్షన్ వెంకట్ రవి, రాదాపుష్ప కన్స్ట్రక్షన్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ …
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత హైదరాబాద్ నగరం విద్యుత్, తాగునీరు, శాంతి భద్రతల వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారించి వాటిని బలోపేతం చేయడంలో విజయం సాధించినట్లు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనీకతతో కృష్ణా, గోదావరి నుంచి వందల కిలో మీటర్ల మేర నీటిని తీసుకువచ్చి హైదరాబాద్ నగర ప్రజల దాహర్తిని తీరుస్తున్నామన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన వేగంగా కొనసాగుతున్నదని, 35 ప్రాజెక్టులను బల్దియా ఆధ్వర్యంలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.