TSRTC | సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై గత ఏడాదిలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని భావించారు. కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాదిలోనైనా.. సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్గానే తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలకు తిరిగే సూపర్లగ్జరీ బస్సుల్లో నగదుతో పాటు ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ ప్రక్రియ రెండు విధాలుగా కొనసాగుతున్నాయి. ఇదే విధానం సిటీ బస్సుల్లో అమలు చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా..నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో అమలు చేస్తున్నారు.