కంటోన్మెంట్, జూన్ 13: కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక జీవితం లేదని కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. భర్తలేని జీవితం ఎందుకని భార్య, తండ్రిలేని జీవనం గడపలేమని కూతుళ్లు ఫ్యాన్లకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొన్నేళ్ల కిందట నగరానికి వలస వచ్చిన సూర్యనారాయణ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఐదేళ్ల కిందట సూర్యనారాయణ అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. ఏప్రిల్ 4న సూర్యనారాయణ మృతి చెందాడు. దశ దినకర్మ తర్వాత ఏప్రిల్ 16న సూర్యనారాయణ భార్య విజయలక్ష్మి(55), ఇద్దరు కుమార్తెలు చంద్రకళ (33) , సౌజన్య(29) ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ బంధువు సుధీర్.. ఆ ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స చేయించాడు.
అనంతరం బంధువులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. వారిలో పూర్తిగా మార్పు వచ్చిందని గ్రహించిన తరువాత తల్లీ, ఇద్దరు కుమార్తెలను ఓల్డ్ బోయిన్పల్లి భవానీ నగర్లోని వారి ఇంటిలో ఉంచారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా తల్లీ కూతుళ్లు.. గత నెల 15వ తేదీన నిద్రమాత్రలు మింగి మరోసారి ఆత్మహత్యకు యత్నించగా.. ఇరుగు పొరుగువారు గమనించి సకాలంలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి ముగ్గురూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, మంగళవారం ఉదయం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువాళ్లు ఇంటిలోకి వెళ్లి చూడగా.. వారు వేర్వేరు గదులలో ఫ్యాన్లకు ఉరివేసుకుని కనిపించారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైట్ నోట్ గుర్తించారు. తమకు ఎవరితోనూ విభేదాలు లేవని, భర్త చనిపోయిన కారణంగానే మనస్తాపంతో చనిపోతున్నామని విజయలక్ష్మి సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విషయం బయటకు రాకుండా బోయిన్పల్లి పోలీసులతోపాటు కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించగా, స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.