బంజారాహిల్స్ : అనాధాశ్రయం నుంచి టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తీసుకువచ్చిన 15మందిలో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం బైపాస్ రోడ్డులో డా. అన్నం శ్రీనివాసరావు అనే సామాజికవేత్త ‘అన్నం ఫౌండేషన్’ పేరుతో అనాధాశ్రయం నిర్వహిస్తున్నారు. మానసిక వికలాంగులతో పాటు వివిద రకాలైన వైకల్యం ఉన్నవారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు.
కాగా జీ తెలుగు చానెల్ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొనేందుకు 15మందిని తీసుకుని శ్రీనివాసరావు గురువారం జూబ్లీహిల్స్లోని పద్మాలయ స్టూడియోకు వచ్చారు.
కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో రాములు (70), ఏసుబాబు (30), వైజయంతి(35) అనే ముగ్గురు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. ఎంతపేపటికీ లోనికి రాకపోవడంతో బయటకు వచ్చి చూడగా వారు కనిపించలేదు.
సమీపంలోని అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఉదయం అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే 9948121034 నెంబర్లో తెలియజేయాలని జూబ్లీహిల్స్ ఎస్ఐ శివశంకర్ కోరారు.