బంజారాహిల్స్, మే 19: భార్యలతో గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్కు చెందిన రాజ్కుమార్(24) బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో భార్య రింకీ సైకియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. మాసాబ్ట్యాంక్లోని ఓ ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డులుగా వీరిద్దరూ పనిచేస్తున్నారు. ఈనెల 17న ఇంట్లో ఉన్న సమయంలో భార్యతో తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకోవడంతో తన చేతిలోని ఫోన్ను విసిరికొట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు.
ఈ మేరకు భార్య రింకీ సైకియా మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షౌకత్నగర్లో భార్య శివకుమారితో కలిసి నివాసం ఉంటున్న లోకేష్కుమార్(32)రోజు కూలీ. గత కొంతకాలంగా రోజూ మద్యం సేవించడంతో పాటు భార్యను తరచూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17న సాయంత్రం మద్యం మత్తులో భార్యతో గొడవపడిన లోకేష్కుమార్ అమెను కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
రెండ్రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో భార్య శివకుమారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరొక ఘటనలో భార్యకు చెప్పకుం డా ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఘటన బంజారాహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని అరోరా కాలనీలో నివాసం ఉంటున్న ముల్లంగిరాజా (40) అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య జయకుమారి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.