సైదాబాద్, అక్టోబర్ 24 : వేర్వేరు ప్రాంతాల నుంచి ముగ్గురు అదృశ్యమయ్యారు. ఈ ఘటనలు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ మమత కథనం ప్రకారం.. సైదాబాద్ సాయిరాంనగర్ నివాసి, ప్రభుత్వ ముద్రణాలయం ఉద్యోగి రాంబాబు (47) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రెండు రోజుల కిందట అతడు డ్యూటీకి వెళ్లి, తిరిగి ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీవన్యార్జంగ్ కాలనీకి చెందిన సయ్యద్ అక్బర్ అలీ భార్య సకినా ఫాతిమా (26) గృహిణి. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె.. తిరిగి రాకపోవటంతో భర్త సయ్యద్ అక్బర్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు నెలల కిందట సకినా ఫాతిమా ఇంట్లో నుంచి నగదు, బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లిందని, ఆ తర్వాత 20 రోజులకు తిరిగి ఇంటికి వచ్చిందని తెలిపారు. తిరిగి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదన్నారు. ఆమె అదృశ్యంపై పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు.
అలాగే.. సాయిరాం కాలనీ ఈశ్వర్ సంయుక్త అపార్టుమెంట్లో నివసించే పోతుల రవికిరణ్ (36) ప్రైవేట్ ఉద్యోగి. ఉద్యోగానికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి పోతుల రామ్మూర్తి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అదృశ్యాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ మమత తెలిపారు.