Crime News | కాచిగూడ, ఏప్రిల్ 27: ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి, దుర్గానిలయం, ప్రగతినగర్ కాలనీకి చెందిన నారాయణ కుమారుడు డి.ప్రసాద్ (55) డార్జిలింగ్ పట్టణంలో సీఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.
ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్- ఫలక్నుమా ఎంఎంటీఎస్ రైలు ఎక్కారు. యాకత్పుర స్టేషన్లో నలుగురు ఆగంతకులు.. రైలు ఎక్కి ఎస్సై ప్రసాద్ను చాకుతో బెదిరించి, దాడి చేసి.. ఆయన వద్ద ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.700 నగదు, 2 సెల్ఫోన్లను తీసుకొని ఉప్పుగూడ రైల్వేస్టేషన్లో దిగి పారిపోయారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.