సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడుతున్న కొందరు చైనీయులు భారతీయులను పావుగా వాడుతూ.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు కమీషన్లు, జీతాల రూపంలో ఇక్కడ సహకరిస్తున్న వారి కోసం వెచ్చిస్తూ.. 70 శాతం ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్చి తమ దేశానికి తరలిస్తున్నారు. కలర్ప్రిడిక్షన్ గేమ్ మోసాలతో చైనీయుల సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలు దేశవ్యాప్తంగా అమాయక ప్రజల నుంచి రూ.1600 కోట్లు దోచుకున్నాయి. నేరగాళ్లు మోసంతో దోచుకుంటున్న సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారనే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. లోన్యాప్లు, ఇన్వెస్ట్మెంట్, పార్ట్టైం జాబ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి దోచేస్తున్న సొమ్ము మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ మార్గంలో తమ దేశానికి తరలిస్తున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక దేశం నుంచి మరో దేశానికి అధికారికంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని, ఇందుకు బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇలా చేస్తే పక్కాగా నిఘా సంస్థలకు పట్టుబడుతామన్న భయంతో నేరగాళ్లు దోచేసిన సొమ్మును విదేశాలకు తరలించేందుకు క్రిప్టో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇండియన్ కరెన్సీతో క్రిప్టోను కొని, దుబాయ్లో విక్రయిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి కరెన్సీని కొనుగోలుచేస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు నిధులు తరలిస్తున్నారు.
పార్ట్టైం జాబ్, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో ట్రేడింగ్, లోన్యాప్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ వంటి తదితర మోసాలలో చిక్కుకున్న బాధితులు ఎప్పుడైతే డబ్బు డిపాజిట్ చేస్తున్నారో.. నిమిషాల వ్యవధిలోనే బాధితుల ఖాతాను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. ఆ ఖాతా నుంచి మరో ఖాతాకు మారుస్తున్నారు. ఏటీఎంల ద్వారా డబ్బు డ్రా చేస్తున్నారు. బాధితులు తాము మోసపోయామనే విషయం తెలుసుకునేలోపే.. బాధితుల సొమ్ము క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు వెళ్లిపోతుంది. ప్రతిరోజు ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో రూ.2 కోట్ల వరకు పార్ట్టైం జాబ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
పార్ట్టైం, ఇన్వెస్ట్మెంట్ మోసాలకు విదేశాల నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాటిని అమలు చేసేందుకు స్థానికులను వాడుతున్నారు. ఇంట్లో ఉండి ఒకటి రెండు గంటలు పనిచేస్తే చాలు.. రోజు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు సంపాదించవచ్చని నేరగాళ్లు చెబుతున్నారు. ఆకర్షణీయమైన మెసేజ్లు పంపిస్తూ.. అమాయకులను ఆకట్టుకుంటున్నారు. నేరగాళ్ల మాటలు నమ్మి.. చాలా మంది వారు చెప్పినట్టు చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
నేరగాళ్లు పంపిస్తున్న మెసేజ్లు నమ్మితే మోసపోవడం ఖాయం. ఎక్కువగా సాఫ్ట్వేర్, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు ఈ మెసేజ్లకు స్పందించి మోసపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే రూ.500 నుంచి వెయ్యి రూపాయలు రావడం కష్టంగా ఉంది. నిమిషాల వ్యవధిలోనే వేల రూపాయలు ఎలా వస్తాయి.. అని ఆలోచన చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తారు. డిపాజిట్లు తీసుకొని టాస్క్లు ఇవ్వడమేంటనే.. ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మెసేజ్లకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.