సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారు, ఆపై వయస్సున్న వారు కూడా ఓటరు జాబితాలో తమ పేరులేని పక్షంలో నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు నమోదుకు www. voters.eci. gov.in ఆన్లైన్ ద్వారా, లేదా ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫారం-6లో పూర్తి వివరాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 2023, అక్టోబరు 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950లో సంప్రదించవచ్చని తెలిపారు.