నగర రోడ్లన్నీ ఈవీ మయమయ్యాయి.. భవిష్యత్కు వెలుగు రేఖలా.. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలు సహా వందలాది ఎలక్ట్రిక్ వెహికిల్స్ సిటీ రహదారులపై రయ్య్మ్రంటూ.. పరుగులు పెట్టాయి. ఈవీ రంగానికి మరింత ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ ఈ- మొబిలిటీ వీక్ ఆదివారం నుంచి పీపుల్స్ ప్లాజా వేదికగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి మియాపూర్ వరకు 700 విద్యుత్ వాహనాలతో మొదలైన భారీ ర్యాలీని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సినీనటుడు అడివి శేష్, దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. హైటెక్స్ వరకు సాగిన ర్యాలీని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఎల్అండ్టీ సీఈవో కేవీరెడ్డి ప్రారంభించారు. వివిధ రకాల ఈవీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 ( నమస్తే తెలంగాణ ) /ఖైరతాబాద్: నగరమంతా ఈవీల సందడితో పులకరించింది. భవిష్యత్తు తరం బాగుండాలంటే ఇక నుంచి విద్యుత్తు వాహనాలనే వినియోగించాలనే సందేశాన్ని ఇచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి 400 వాహనాలు, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 300 వాహనాలకు పైగా ఆయా మార్గాల్లో గమ్యస్థానమైన హైటెక్స్కు చేరుకున్నాయి. దారిపొడవునా విద్యుత్తు వాహనాలు నడుపుతూ.. యువతీ, యువకులు, దివ్యాంగులు సందడి చేశారు. ‘స్వచ్ఛమైన గాలికి ఈవీనే భరోసా’, ‘ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయ్.. కాలుష్యాన్ని తరిమేయ్’ తదితర స్లోగన్స్తో ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు, బస్సులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. కాగా పీపుల్స్ ప్లాజా వద్ద ర్యాలీని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హీరో అడవి శేష్, దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, మియాపూర్లో ర్యాలీని ఎల్అండ్టీ సీఈఓ కేవీ.రెడ్డి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో టీఎస్ఆర్టీసీ, అపోలో టైర్స్, సిట్రియన్, టీవీఎస్, ఓలా, ఏతెర్, ఉబెర్, గ్రావటన్, ఎంజీ మోటర్స్, మహీంద్రా, క్వాంటాం, ఆటం మోటర్స్, బడ్ తదితర కంపెనీలు తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తులతో పాల్గొన్నాయి. అనంతరం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈవీ సంగీత కచేరి ప్రత్యేకంగా నిలిచింది. బ్యాండ్ బడ్జిస్, జామర్స్ బ్యాండ్, గీత రచయిత కృష్ణ చైతన్య చేసిన ఆకర్షణీయమైన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈవీ రంగ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.
ఈవీ ప్రదర్శనలో గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బైకుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండున్నర గంటల పాటు చార్జ్ చేస్తే 160 (ఎకనామి), నగరంలో 110, స్పోర్ట్స్ వెర్షన్ అయితే గంటకు 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గ్రావ్టన్ మోటార్స్కు చెందిన క్వాంటా పేరుతో వచ్చిన ఈ బైక్పై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్లో ఈ బైక్ స్థానం సంపాదించుకున్నది. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రయాణించిన క్వాంటా ఈవీ దేశంలోనే మొదటి వాహనంగా నిలిచిందని నిర్వహకులు తెలిపారు.
హెచ్ఐసీసీలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మొబిలిటీ నెక్స్ హైదరాబాద్ సమ్మిట్-2023 జరుగనున్నది. దీనికి ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరుకానున్నారు. ఎమెర్జింగ్ గ్లోబల్ ట్రెండ్స్, రోడ్ టూ షేర్డ్ మొబిలిటీ, దేశంలో ఈవీ వినియోగం పెరగడం తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ ఉండనున్నాయి.
స్టంట్స్ అంటే యువతకు ఎంతో క్రేజ్. సాధారణంగా ఖాళీ రోడ్లపై కొందరు సరదాకు స్టంట్స్ చేస్తుంటారు. మరికొందరు స్టంట్స్ను ప్రొఫెషన్గా పెట్టుకుంటారు. అయితే ఇందనంతో నడిచే వాహనాలకు గేర్లు, ఇతర ప్రత్యేకతలు ఉంటాయి. కాని ఎలక్ట్రిక్ వాహనాలు అందుకు బిన్నంగా ఉంటాయి. అయినా ఆధునిక టెక్నాలజీ ఆ లోటును తీర్చింది. ఈవీతో కూడా స్టంట్స్ చేయవచ్చని నిరూపించారు. ఈవీ ర్యాలీలో గ్రావ్టన్ మోటార్స్ వారి ద్విచక్రవాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వాహనాలపై షెరాజ్, రాహుల్ అనే యువకులు చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. వారి స్టంట్స్కు ఆకర్షితులైన నటుడు అడివి శేష్, దర్శకుడు నాగ్ ప్రత్యేకంగా అభినందించారు.
సామాన్యుడి రవాణా వ్యవస్థ ఆటోలు. ఇప్పటి వరకు శిలాజ ఇంధనం, సీఎన్జీతో నడిచేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రంగంలోకి ఎలక్ట్రిక్ వాహనాలు సైతం చేరాయి. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ పదర్శనలో ఈ ఆటో ప్రత్యేకంగా ఉంది. ట్రైలక్స్ పేరుతో వచ్చిన ఆటోలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కసారి చార్జి చేస్తే 129 కిలోమీటర్లు సునాయసంగా వెళ్తాయి. దానికి జీపీఎస్ ట్రాక్ లాంటి సౌకర్యం కూడా ఉంది. ఈ ఆటోలో సైతం డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ప్రయాణించవచ్చు.