బంజారాహిల్స్,ఆగస్టు 4: ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ ఓ వైద్యురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని శ్రీనికేతన్ కాలనీలో నివాసం ఉంటున్న డా.జీవీ.లక్ష్మి అనే వైద్యురాలికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి కాల్ చేస్తున్నాడని, మీకు సంబంధించిన ఫిర్యాదును గురించి వివరాలు తెలియజేయాలని కోరాడు.
దాంతో డా.లక్ష్మి తాను ఇటీవల క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్ ఇంకా డెలివరీ కాలేదని చెప్పారు. క్రెడిట్ కార్డు వివరాలు చెబితే వెంటనే సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికిన గుర్తుతెలియని వ్యక్తి తీరుపై అనుమానం వచ్చిన డా.లక్ష్మి వివరాలు చెప్పనని స్పష్టం చేసింది. అయితే తనకు నేరుగా కార్డు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని, తాను పంపించే ‘కంప్లెయింట్.ఏపీకే’ యాప్తో పాటు ‘బేస్.ఏపీకే’ యాప్లో వివరాలు నమోదు చేస్తే క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని చెప్పాడు.
అతడు సూచించిన విధంగా యాప్స్లో వివరాలు నమోదు చేయడంతో పాటు ఓటీపీ ఎంటర్ చేయగానే డా.లక్ష్మి అకౌంట్లో నుంచి రూ.95వేలు డ్రా అయినట్లు మెసేజీ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే ఎస్బీఐ క్రెడిట్ కార్డు కాల్సెంటర్కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించారు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.