బంజారాహిల్స్, నవంబర్ 1 : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులందరికీ సముచితమైన స్థానం లభించాలన్నదే తన అభిప్రాయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన భర్త మన్నె గోవర్ధన్రెడ్డికి ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్ రాకపోవడంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిశారు. కార్యకర్తలను సమన్వయం చేసుకొని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. డివిజన్లోని కార్యకర్తలందరూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని గత ఎన్నికలతో పోలిస్తే మరింత ఎక్కువ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మన్నె గోవర్ధన్రెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తనకు టికెట్ లభించిందని, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మన్నె గోవర్ధన్రెడ్డితో మాట్లాడి ఆయనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 200మందికి పైగా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి పనిచేసిన వారు ఉన్నారని, ఎన్నికలు ముగిసిన వెంటనే వారికి సముచితమైన స్థానాలను కల్పించడం తన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు బరిగెల వెంకటస్వామి, ఆంథోనీ పాల్గొన్నారు.