సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఆదివారం వచ్చిందంటే చాలు నగర శివారుల్లోని జాతీయ రహదారులపై బైక్ రేసర్ల హంగామా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్పై అతివేగంగా వెళ్తూ.. మార్నింగ్ వాకర్స్పై దూసుకెళ్తున్నారు. వేగమే కాదు.. స్పోర్ట్స్ బైక్తో యువత విన్యాసాలు కూడా చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నారు. వారాంతపు సెలవుల్లో ఔటర్ రింగ్రోడ్డు, ఆ చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారులపై బైక్ రేసర్ల హడావిడి ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో కొన్ని బైకర్స్ క్లబ్స్ కూడా ఉన్నాయి. వీళ్లంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో ఒక గ్రూప్గా తయారవుతున్నారు. ఇలాంటి గ్రూప్ల ద్వారా బైక్ రేసులు నిర్వహిస్తున్నారు. ఒక హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు, గుట్టల్లోనూ ఈ క్లబ్ల ద్వారా రేసింగ్లు నిర్వహిస్తున్నారు.
బైక్ రేసింగ్లకు హైహెండ్, హైస్పీడ్ బైక్లు వాడుతారు. ఈ వాహనాలను విద్యార్థులు, యువకులు ఎక్కువగా రేసింగ్లకు ఉపయోగిస్తున్నారు. ఆదివారం ఉదయం రాజీవ్ రహదారిలో బైక్ రేసింగ్కు వెళ్తున్న సికింద్రాబాద్ నివాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఆదిత్య స్పోర్ట్స్ బైక్పై వేగంగా దూసుకువెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో చలగాటమాడుతూ, ఇతరుల ప్రాణాలను హరించి వేస్తున్న రేసర్లపై పోలీసులు నిఘాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. వారం రోజుల కిందట నార్సింగి పరిసరాల్లో కూడా స్పోర్ట్స్ కారుతో రేసింగ్కు పాల్పడుతున్న యువకులను స్థానిక పోలీసులు పట్టుకున్నారు.
రోడ్లపై ఎంత స్పీడ్ వెళ్లాలి.. బైక్ బరువెంత.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ వాహనాన్ని అదుపు చేయగలడా.? తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటివేవి పట్టించుకోకుండా తల్లిదండ్రులు తమ పిల్లల కోరిక మేరకు స్పోర్ట్స్ బైక్ ఇప్పిస్తున్నారు. జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నారు. రేసింగ్ బైక్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే.. పిల్లల దూకుడుతగ్గుతుందని సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. బైక్ రేసింగ్లతో ప్రమాదాలు ఉంటాయన్న విషయాన్ని పిల్లలకు చెప్పాలని, వారిని రేసింగ్లకు వెళ్లకుండా కట్టడి చేయాలని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తల్లిదండ్రుల జాగ్రత్తతోనే పిల్లలు రేసింగ్కు దూరంగా ఉంటారు. స్వీయ క్రమశిక్షణతో పిల్లలు బైక్ రేసింగ్లకు దూరంగా, ప్రమాదాలకు తావులేకుండా చేసుకోవాల్సిన అవసరముంది.