HomeHyderabadThere Is Severe Criticism Over The Conduct Of Blos In Distributing Enumeration Forms
బీఎల్వోల్లో భయం.. భయం
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారాలు పంపిణీ చేయకుండా తమ వద్దే కుప్పలుగా ఉంచుకోవడంతో ఓటర్లలో అయోమయం నెలకొంటున్నది. మరోవైపు బీఎల్వోల్లో చాలా మంది దిగువ స్థాయి సిబ్బంది ఉన్నారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అటెండర్లు బీఎల్వోలుగా పనిచేస్తున్నారు.
ఓట్లు తొలగిపోతే తమ మీదకే వస్తదని ఆందోళన
భవిష్యత్లో ఇబ్బందులు ఉంటాయని ఆవేదన
పత్రాలపై అవగాహన లేకపోవడంతో ఇక్కట్లు
సిటీ బ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారాలు పంపిణీ చేయకుండా తమ వద్దే కుప్పలుగా ఉంచుకోవడంతో ఓటర్లలో అయోమయం నెలకొంటున్నది. మరోవైపు బీఎల్వోల్లో చాలా మంది దిగువ స్థాయి సిబ్బంది ఉన్నారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అటెండర్లు బీఎల్వోలుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి సాంకేతికతపై అవగాహన లేకపోవడంతో సర్ కోసం రూపొందించిన యాప్ను నిర్వహించలేకపోతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఫారాల పంపిణీ, ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వరుస కడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బీఎల్వోల అవగాహన లేమితో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్యూమరేషన్ ఫారాలు ఇండ్లకు పంపకపోవడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. తమ ఫారాలు ఎందుకు ఇండ్లకు పంపలేదని బీఎల్వోలను నిలదీస్తున్నారు. ఏదైనా కారణంతో తమ ఓట్లు తొలగిపోతే బీఎల్వోలే బాధ్యత వహించాలని బాహాటంగానే చెబుతున్నారు.
బీఎల్వోల తప్పిదాల వల్లనే ఫారాలు తమకు అందడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపుగా అక్కడి స్థానికులే బీఎల్వోలుగా ఉన్నారు. వారంతా స్థానికులే కావడం వల్ల ప్రతి ఓటరుకు బీఎల్వో తెలి సే ఉంటారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ తర్వాత బీఎల్వోలు అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఓట్లు తొలగిపోయిన వాళ్లు ఇబ్బందులకు గురిచేస్తారని బీఎల్వోలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సర్ ప్రక్రియ తలనొప్పిగా మారిందని.. ఏ కారణంతోనైనా ఓటు పోతే తమనే నిందిస్తారని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటర్ల సవరణలో ఏమాత్రం తేడాలొచ్చినా తమ మీదకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అసహనం..
క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నది. ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు దగ్గర పడుతుంటంతో బీఎల్వోలపై సబంధిత అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఎల్వోల నిర్లక్ష్యం కారణంగా ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఆగ్రహంగా ఉన్నారు. శేరిలింగంపల్లి జోన్లో సోమవారం సర్ ప్రక్రియపై సమీక్ష సమాశం నిర్వహించా రు. ఎన్యూరేషన్ ఫారాలు అందరికీ అందకపోవడం, డిజిటలీకరణ మందకొడిగా సాగుతుండంతో జోనల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.
బీఎల్వోలు, ఈఆర్వోలు, సూపర్వైజర్లను నోటికొచ్చినట్లు తిట్టినట్లు సమాచారం. గడువు పూర్తవుతు న్నా ఏమాత్రం చలనం లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ రెగ్యులర్ విధుల నుంచి సర్ కోసం కేటాయించి.. అధికారులు తిట్టడం పై బీఎల్వోలు, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో గ్రేటర్ అంతటా అధికారులు బీఎల్వోలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే శ్రద్ధ సర్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఉంటే ఇంత గందరగోళం నెలకొనేది కాదని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అధికారుల సమీక్షలు, సమావేశాలు ముందు నుంచి పెడితే సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేది. ఇప్పటికైనా దృష్టి సారించి అర్హులు తమ ఓట్లు కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.