సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు వైద్యాధికారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి బల్దియా మెడికల్ విభాగానికి డిప్యూటేషన్పై వచ్చిన అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు(ఏఎంఓహెచ్) ఏండ్ల తరబడి తిష్ట వేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు (ఏఎంఓహెచ్) దాదాపు 17 మంది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి డిప్యూటేషన్పై వచ్చి పనిచేస్తున్నారు. వాస్తవంగా డిప్యూటేషన్పై వచ్చిన వాళ్లు మూడేండ్లు మాత్రమే పనిచేయాలి. ఆ తర్వాత వీరి సేవలు కొనసాగాలంటే సచివాలయ స్థాయిలో నిర్ణయాలు జరగాలి. ఆది కూడా ఏడాది, అవసరమైతే మరో ఏడాది ..ఇలా గరిష్టంగా ఐదేండ్లు పనిచేయవచ్చు. కానీ వీరిలో కొందరు ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. భార్గవ నారాయణ అనే అధికారి దాదాపు పదేండ్ల క్రితం వచ్చారు.. ఐదేండ్లకు పైగా ఖైరతాబాద్ సర్కిల్లో పని చేశారు.
మాతృసంస్థకు పంపినా వెళ్లలేదు. దీంతో బల్దియాలోనే బదిలీతో సరి పెట్టడంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ సర్కిల్లో పని చేస్తున్నారు. ముషీరాబాద్ సర్కిల్ ఏఎంవోహెచ్ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇలా ఒకసారి జీహెచ్ఎంసీలో అడుగు పెడితే పొమ్మని ఆర్డర్ జారీ చేసినా వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. తాజాగా శేరిలింగంపల్లి సర్కిల్ 20 ఏఎంవోహెచ్ నగేశ్ నాయక్ను ఈ నెల 1న మాతృసంస్థకు పంపిస్తూ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా రెండు రోజులుగా నగేశ్ నాయక్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బల్దియాలోనే కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎంవోహెచ్లపై అవినీతి ఆరోపణలు ఉండడంతో రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యఅధికారితో పాటు కొందరు ఉద్యోగులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పాలన వ్యవహారాలపై బుధవారం సిటీ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించనున్నారు. ఉదయం 11గంటలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, బల్దియా కమిషనర్తోపాటు అధికారులు పాల్గొనున్నారు.