GHMC | సిటీబ్యూరో: బల్దియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ బక్కచిక్కుతున్నా.. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముంచుకొస్తున్నా.. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యం రూ.2100కోట్లలో ఇప్పటి వరకు రూ.1333 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అలాగే ట్రేడ్ లైసెన్స్ల జారీ, రెన్యువల్లోనూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి లక్ష ఆరు వేల మంది వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్ చేస్తే..ఈ సారి మాత్రం కేవలం 34వేల మాత్రమే రెన్యువల్ కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. జోనల్ కమిషనర్లు, కమిషనర్ పర్యవేక్షణ లోపం కారణంగా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ల జారీలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా జవనరి నుంచి డిసెంబర్ వరకు ట్రేడ్ లైసెన్స్ల గడువు ఉంటుంది. జవనరిలో రెన్యువల్స్ ఉంటాయి. కొందరు వ్యాపారులు ముందే రెన్యువల్ చేసుకుంటారు. అయితే ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్లో జాప్యం చేస్తే లైసెన్స్ ఫీజుకు అదనంగా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు మధ్యలో రెన్యువల్ చేస్తే 25 శాతం అపరాధ రుసుం, ఏప్రిల్ 1 తర్వాత లైసెన్స్లను పునరుద్ధరిస్తే రెన్యువల్ దరఖాస్తులపై అదనంగా 50 శాతం అపరాధ రుసుముగా వసూలు చేస్తారు. ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100 శాతం పెనాల్టీ విధించడంతో పాటు నెలకు 10శాతం అదనపు జరిమానా విధిస్తారు.
ఆస్తిపన్ను వసూళ్లలో అక్రమాలను పరిశీలిస్తే… ఆస్తిపన్ను ఏరియా తక్కువ చూపించడం.. కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్ చూపించడం, వేయాల్సిన ట్యాక్స్ ఒక్కసారి వేసి భయభ్రాంతులకు గురివేసి ఆ తర్వాత సంబంధిత భవన యజమానితో ఒప్పందాలు కుదుర్చుకోవడం… అదనపు అంతస్తులు ఉంటే చూసీచూడనట్లు ఉండడం…నిర్మాణంలో ఒక్క దుకాణం ఉన్న.. రెసిడెన్షియల్గానే చూపించడం వంటివి అక్రమాలు జరుగుతున్నాయన్నది అక్షరసత్యం. ట్రేడ్ లైసెన్స్ పాత ట్రేడ్ ఇండెక్స్ నంబరు..ఈజీగా ఇవ్వరు..ప్రొవిజన్ విధానంలో కొనసాగిస్తూ వ్యాపారస్తులతో కొందరు అధికారులు అందినంత దండుకుంటున్నారు. దీని ఫలితంగానే ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ల నుంచి రావాల్సిన ఆదాయం సంస్థకు రావడం లేదు.
ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడం కష్టమేనని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కమిషనర్ ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆస్తిపన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. గత నెల 31వ తేదీ మాత్రం ఒక్కరోజు రికార్డు స్థాయిలో రూ. 28కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రూ.2100కోట్ల టార్గెట్లో ఇప్పటి వరకు రూ. 1333 కోట్లు మాత్రమే ఆస్తిపన్నును రాబట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెన్యువల్ గడువును జనవరి 31వరకు తొలుత విధించామని, తాజాగా 25 శాతం పెనాల్టీతో మార్చి 31 వరకు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందని, ఏప్రిల్ 1 తర్వాత చేసుకోవాలంటే 50 శాతం మేర జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ పత్రాలను పునరుద్ధించుకోవాలన్నారు.