సికింద్రాబాద్, మార్చి22 : సికింద్రాబాద్ను(Secunderabad) ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. నూతనంగా సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇందుకు స్పందిస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 40జీహెచ్ఎంసీ డివిజన్లతో కూడిన సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తలసాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశారు. శుక్రవారం ఆలేఖ ప్రతిని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్లతో పాటు ఇతర కమిటీ సభ్యులకు వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద అందజేశారు. తమ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.