మియాపూర్, మార్చి 17: దైనందిన జీవినంలో నెలకొంటున్న వత్తిళ్ల నుంచి ఉపషమనం లభించేలా పచ్చదనంతో ఆహ్లాదకరంగా నియోజకవర్గంలో పార్కులను తీర్చిదిద్డుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. భిన్నమైన థీమ్లతో ఆహ్లాదమే కాకుండా ప్రజారోగ్యానికి ఉపయోపడతాయన్నారు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని పలు థీమ్ పార్కు సుందరీకరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా పార్కులను థీమ్లతో తీర్చిదిద్దుతున్నట్లు వాటిల్లో పచ్చదనం, వాకింగ్ ట్రాక్, కూర్చునేందుకు సౌకర్యవంతమైన బల్లాలు, ఆడుకునే పరికరాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్కులలో షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అవి ఆరోగ్యాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
థీమ్ పార్కు నిర్మాణ, సుందరీకరణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సెలవు రోజులలో ఉపషమనానికి హాళ్లు, మాల్స్కు పరుగులు తీసే ప్రజానీకానికి పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే పార్కులను అందుబాటులోకి తీసుకురావటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ జాప్యానికి ఆస్కారం లేకుండా చూడాలని ఎమ్మెల్యే కృష్ణారావు సూచించారు. అవసరమైతే సీఎం కేసీఆర్, కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులను మంజూరు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ ఆనంద్, కార్పొరేటర్ పగుడాల శిరీష బాబారావు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు .
కాలనీ డివిజన్ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 2 ఆలయ సుముదాయంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణ భూమిపూజను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తన తోడ్పాటును అందిస్తానని ఆయన కమిటీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.