హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకలలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి TSMIDC చైర్మన్ ఏర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బషీర్ బాగ్లో చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి, బేగంపేటలోని NBT నగర్ లో, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంట లలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దళితుల కోసం తమ జీవితాలను ధార పోసిన మహా నేతలు బాబా సాహెబ్, బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలోనే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభిస్తుందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో బన్సీలాల్ పేట, సనత్ నగర్, బేగంపేట కార్పొరేటర్ లు హేమలత, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, నిర్వహకులు నారాయణ,లక్ష్మణ్, TRS నాయకులు నరేందర్, శ్రీహరి, శేఖర్, లక్ష్మీపతి, ప్రేమ్, అబ్బాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.