శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20: ఎంతో నమ్మకంగా పనిచేసి.. అదును చూసి.. ఇంటిని దోచేశారు నేపాలీ దంపతులు. యజమాని కుటుంబం దైవదర్శనానికి వెళ్లివచ్చేసరికి భారీ మొత్తంలో సొత్తును దోచుకెళ్లారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి టెలీకాంనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. రోడ్డు నంబర్ 9లో బీరం గోవిందరావు, దీప దంపతులు నివాసముంటున్నారు. వీరింట్లో గతంలో నేపాల్కు చెందిన ఎంలాల్ అనే వ్యక్తి వాచ్మన్గా పనిచేసేవాడు. పదిహేను రోజుల్లో వస్తానంటూ.. ఐదు నెలల కిందట స్వస్థలానికి వెళ్లాడు. తనకు బదులు లక్షణ్(30), పవిత్ర(30) దంపతులను గోవిందరావు ఇంట్లో పనికి పెట్టి వెళ్లిపోయిన ఎంలాల్ తిరిగి రాలేదు. లక్ష్మణ్ వాచ్మన్గా, అతడి భార్య పవిత్ర ఇంటి పనులు చేస్తూ.. ఎంతో నమ్మకంగా ఉండేవారు. అక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదిలో నివసిస్తున్నారు.
శనివారం ఉదయం 11 గంటల సమయంలో గోవిందరావు, అదే ఫ్లాట్లో ఉండే స్నేహితుడు గంగాధర్రెడ్డి వారి కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకునేందుకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆదివారం వస్తామని లక్ష్మణ్ దంపతులకు చెప్పి బయలుదేరారు. ఆదివారం ఉదయం గోవిందరావు లక్ష్మణ్కు ఫోన్ చేయగా, స్విచాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి మూడో అంతస్తులో అద్దెకుంటున్న మరో వ్యక్తికి కాల్చేసి ఆరా తీశాడు. లక్ష్మణ్ కనిపించడం లేదని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. ఆదివారం రాత్రి శ్రీశైలం నుంచి కుటుంబసభ్యులతో తిరిగి వచ్చిన గోవిందరావుకు లక్ష్మణ్ దంపతులు కనిపించలేదు. కిటికీ అద్దం పగిలి.. గ్రిల్ తొలగించి ఉన్నది. లోపలికి వెళ్లి చూడగా, బెడ్ర్రూం తలుపు పగలగొట్టి.. లాకర్ తెరిచి ఉంది. అందులోని రూ. 15 లక్షల నగదు, 110 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు గోవిందరావు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్లూస్టీం పరిశీలించింది. సీసీ పుటేజీ సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.