వెంగళరావునగర్, జూన్ 4 : అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో.. అంటూ సోదరుడికి ఫోన్ చేసిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోరబండ రాజ్నగర్ నివాసి చుక్కా శ్రీనివాస్ పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో వార్టుబాయ్గా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు చుక్కా సాయికుమార్ (21) పద్మారావునగర్లోని సర్ధార్ పటేల్ కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతూ.. పార్ట్టైమ్గా బిగ్ బాస్కెట్లో డెలవరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నెల రోజుల కిందట సాయికూమార్ కృష్ణకాంత్ పార్కుకు వెళ్లిన సమయంలో తన సెల్ఫోన్ పోయింది. ఈఎంఐ పద్దతిలో రూ.28 వేల విలువజేసే మరో ఫోన్ను తండ్రి ఇప్పించాడు.
రెండోసారి ఫోన్ పోవడంతో..
శుక్రవారం రోజున బస్తీలో వాటర్ క్యాన్ తీసుకువచ్చే సమయంలో ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ రోడ్డుపై పడిపోయింది. రెండో ఫోన్ కూడా పోవడంతో బాధపడ్డాడు. తండ్రి మాత్రం మందలించలేదు. కొద్ది రోజుల్లో మరో ఫోన్ ఇప్పిస్తానంటూ నచ్చజెప్పాడు. రెండుసార్లు ఫోన్లు పోగొట్టుకున్నాను.. అంటూ సాయికుమార్ తన స్నేహితులతో చెప్పి బాధపడ్డాడు. శనివారం ఉదయం మిత్రులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన సెల్ఫోన్ పోయిందని అక్కడి పోలీసు సిబ్బందికి చెప్పాడు. అక్కడి సిబ్బంది ఈ-సేవ కేంద్రంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో మిత్రులతో కలిసి ఈ- సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి, తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
నా వల్ల నాన్న ఇబ్బంది పడుతున్నాడు..
సాయంత్రం నాలుగు గంటల సమయంలో సాయికుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాటసారుల ఫోన్ సహాయంతో.. సాయంత్రం 5.20 గంటల సమయంలో అన్న వినోద్కుమార్కు ఫోన్ చేశాడు. తనవల్ల తండ్రికి ఇబ్బందులు వస్తున్నాయి.. అమ్మానాన్నను బాగా చూసుకోవాలని చెప్పాడు. తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్కాల్ కట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నగరంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ అభించలేదు. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బోరబండ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.
తుకారాంగేట్లో ఆత్మహత్య..
మరుసటి రోజు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల నుంచి సాయికుమార్ తండ్రి శ్రీనివాస్కు ఫోన్ వచ్చింది. తుకారాంగేట్ రైల్వేట్రాక్ వద్ద రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు..అతడి మృతదేహం రెండు ముక్కలు అయ్యింది.. వచ్చి గుర్తించాలని రైల్వే పోలీసులు సూచించారు. దీంతో శ్రీనివాస్ హుటాహుటిన గాంధీ దవాఖాన మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని చూసి.. చనిపోయింది తన కుమారుడేనని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.