వెంగళరావునగర్, జూన్ 4 : గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని యాదగిరినగర్లో ఉన్న ఓ ఇంటి మేడపై కోడికి కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా, ఎస్సై రంజిత్ కుమార్ వారి బృందంతో దాడులు చేశారు.
కోడి పందాలను నడుపుతున్న నిర్వాహకులు బి.వెంకటయ్య, బి.సత్తిబాబుతోపాటు 12 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారినుంచి 10 పందెం కోళ్లు, 90 కోడి కత్తులు, రూ.19,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.