రవీంద్రభారతి : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేశారు.అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మికుల గురించి నిరంతరం ఆలోచించి వారి సంక్షేమం కోసం కృషిచేసే జాతిపితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని, తెలంగాణ దేశానికే దిక్సూచి అని చెప్పారు.
గత రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించి అల్లకల్లోలం చేసిన సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు డబ్బులిచ్చి వారి స్వస్థలాలకు పంపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలను తీసుకువస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గూగుల్,అమోజాన్ వంటి పరిశ్రమల బ్రాంచీలను హైదరాబాద్ నగరంలో పెట్టారని చెప్పారు.అది ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఘనతేనని కొనియాడారు.
కార్మికులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా ప్రవేశపెట్టారని చెప్పారు. అదే విధంగా రాష్ట్రం ఏ ఒక్కరూ కూడా పేదరికంలో ఉండకూడదనే లక్ష్యంతో పేదరికంలో మగ్గిపోతున్న దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల దళిత బంధు ప్రవేశపెట్టి దళితులను ధనవంతులను చేయడం సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు కూడా దళితబంధు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని చిన్నపెద్దతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కార్మికులు సంతోషంగా ఉంటున్నారని చెప్పారు. కార్మికులకు వైద్యబీమా, జీవిత బీమా వంటి పథకాలతో వారికి ఎలాంటి వ్యాధులు వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు.అంతేకాకుండా కార్మికులు మేనేజ్మెంట్ కలిసి పనిచేస్తున్నామని,కార్మిక సంఘాలు ఇప్పటి వరకు ఎలాంటి సమ్మేలు, గొడవలు కాని లేవన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు ఉపాధి కోసం వస్తున్నారని, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో కార్మికులకు, యువకులకు కావలసినంతా పనిదొరుకుతుందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రశాంతమైన వాతావరణం, మతసామరస్యానికి నగరం కేంద్రంగా ఉందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎలాంటి గొడవులు లేవని చెప్పారు.రాష్ట్రంలోని కార్మికులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అనంతరం మంత్రులు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో కార్మికులు సంతోషంగా జీవిస్తున్నారని, బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తూ, కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు.కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేమున్నామని , ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అనంతరం పలువురికి శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.