సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపుతామంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్’ (భూ గర్భ సంపులు) ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. గతేడాది బల్దియా అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు గత కొన్ని నెలలుగా కనీస నిర్వహణ లేకపోవడంతో ఇటీవల కురిసిన తొలకరి వానకే వరద నీరు ముంచెత్తింది.
సచివాలయం ముందు, రాజ్ భవన్ రోడ్, కేపీసీ జంక్షన్తో పాటు నగరంలోని 12 కీలక ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సంపులు.. ఇప్పుడు ముంపును నివారించాల్సింది పోయి, కొత్త సమస్యలకు కారణమవుతుండటంపై ప్రస్తుతం నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్లో ప్రతి చిన్న వర్షానికీ రోడ్లు చెరువులను తలపించడం, కాలనీలు నీట మునగడం, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈ భూగర్భ సంపుల నిర్మాణాలను ప్రయోగాత్మకంగా చేపట్టారు.
భారీగా వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి 12 ముంపు ప్రాంతాల్లో ఒకో సంపునకు 10 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో ఈ స్ట్రక్చర్లను నిర్మించారు. కురిసిన వర్షపు నీటిని తాతాలికంగా ఈ భారీ సంపుల్లోకి మళ్లించి నిల్వ చేయడం, ఆ తర్వాత హై-కెపాసిటీ మోటార్ల ద్వారా ఆ నీటిని క్రమంగా డ్రైనేజీ వ్యవస్థలోకి పంపించడం ద్వారా వరద ముంపు సమస్యకు తావు ఉండదు. అయితే ఇంజినీరింగ్ విభాగం అధికారులు వర్షాకాలం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ భూ గర్భ సంపులను నిర్వహణను మరిచిన ఫలితంగా సమస్య పునరావృతమైంది.
తొలకరి వానకే వెలుగులోకి లోపాలు
కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భూ గర్భ సంపుల నిర్మాణం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం నిలువెల్లా బయటపడింది. ఎకడైతే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారో, సరిగ్గా అదే ప్రాంతాల్లో గంటల తరబడి నీరు నిలిచిపోయింది. సంపుల్లో చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయాల్సిన హై-కెపాసిటీ మోటార్లు చాలా చోట్ల మొరాయించాయి. కొన్నిచోట్ల మోటార్లు పూర్తిగా దెబ్బతినగా, మరికొన్ని చోట్ల కనీస నిర్వహణ లేక సాంకేతిక లోపాలు తలెత్తాయి. సంపులకు అనుసంధానంగా ఉన్న పైప్ లైన్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
నీటిని డ్రైనేజీలకు తరలించే పైపుల్లో భారీగా మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోయాయి. పైగా రోడ్డుపై నీరు సంపుల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ పూర్తిగా మట్టితో మూసుకుపోయాయి. ఫలితంగా తొలకరి వర్షానికి నీరు కిందికి వెళ్లే మార్గం లేక రోడ్లపైనే భారీగా నిలిచిపోయింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే వీటిని తనిఖీ చేసి, సిద్ధంగా ఉంచాల్సి ఉండగా.. ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఈ 12 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి వరద ముంపు ముప్పును తప్పించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.