కంటోన్మెంట్, మార్చి 10: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో శుక్రవారం చేపట్టిన బోర్డు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో బోర్డు కార్యాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. బోర్డు కార్యాలయానికి జనాలు తరలిరావడంతో గోపాలపురం ఏసీపీ, మారేడ్పల్లి సీఐ నేతాజీ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తును నిర్వహించారు.
కంటోన్మెంట్ బోర్డులోకి రాకుండా పోలీసులు భారీ బారీకేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని తోసుకుని వచ్చి బోర్డు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించే వరకు అందోళనలు చేపడుతామని బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా కంటోన్మెంట్ పరిధిలో సుమారు 35వేల ఓట్లను తొలగించి కనీస ప్రాథమిక హక్కును సైతం హరింపజేస్తున్న కేంద్ర వైఖరిని ఎండగడుతూ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన చేపట్టారు. ‘కరుణించు కంటోన్మెంట్ బోర్డు….కలిపించు మాకు ఓటు హక్కు’ తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఎనిమిది వార్డులకు చెందిన సుమారు 35 వేల ఓట్లను తొలగించి కేంద్రం చోద్యం చూస్తుందని విమర్శించారు. ఓటు హక్కు కోల్పోయిన వారికి తిరిగి ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు బీఆర్ఎస్ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తుంటే, రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మాత్రం ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బోర్డు సీఈఓ అందుబాటులో లేకపోవడంతో బోర్డు కార్యాలయ సూపరిండెంటెండ్ అక్బర్ ఆలీకి మన్నె క్రిషాంక్ మెమెరాండం అందజేశారు. కార్యక్రమంలో శామ్యూల్, మోని, రఘు, శ్రీను, సాయికిరణ్, త్రివేద్, సుశీల్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.