సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వాహనాల దొంగను ‘పింక్ కలర్ హెల్మెట్’ పట్టించింది. వేర్వేరు ప్రాంతాల నుంచి రైలు, బస్సుల్లో హైదరాబాద్కు వస్తున్న నేరగాళ్లు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. ఆ వాహనాలను గ్రామాలకు తరలించి, ప్లేట్లు మార్చి అమాయకులకు తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 10న తుకారాంగేట్ పోలీసు స్టేషన్లో నమోదైన వాహనం చోరీ కేసును పోలీసులు సీసీ కెమెరాల సహాయం.. పింక్ కలర్ హెల్మెట్ ఆధారంగా ఛేదించారు. ఒక వాహనం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు గత సోమవారం నిందితులు చిక్కడంతో పాటు పది వాహనాలు దొరికాయి.
రైల్వే ఉద్యోగి అభిమన్యు ప్రసాద్ గత నెల 10వ తేదీన తన బైక్ (షైన్)ను రైలు నిలయం ఎదురుగా ఉన్న బైక్ పార్కింగ్ వద్ద పార్క్ చేశాడు. హెల్మెట్ కూడా వాహనానికే ఉంది. డ్యూటీ ముగించుకొని తిరిగి వచ్చిన అభిమన్యుకు బైక్, బైక్కు ఉన్న పింక్ కలర్ హెల్మెట్ కనిపించలేదు. బాధితుడు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తునకు పింక్ కలర్ హెల్మెట్ ప్రధాన క్లూగా మారింది. సీసీ కెమెరాల సహాయంతో చోరీ జరిగిన స్థలం, సమయం ఆధారంగా పింక్ కలర్ హెల్మెట్ ధరించి వెళ్లిన మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించారు.
ఆ మూడు వాహనాల్లో పింక్ కలర్ హెల్మెట్తో షైన్ వాహనంపై వెళ్లిన వ్యక్తిపై నిఘా పెట్టిన పోలీసులు.. దారి పొడువునా ఉన్న 35 సీసీ కెమెరాల సహాయంతో ముందుకువెళ్తూ నిందితుడు రియాజుద్దీన్ను గతనెల 28న కామారెడ్డిలోని అశోక్నగర్లో అరెస్టు చేశారు. విచారించగా.. 10 బైక్లు చిక్కాయి. రైలు, బస్సుల్లో హైదరాబాద్కు వస్తున్న నిందితుడు.. బైక్లు తస్కరించి, వాటిపైనే కామారెడ్డికి వెళ్తున్నాడు. వాటిని విక్రయించాలని కోరుతూ బస్ డ్రైవర్ శ్రీనివాస్గౌడ్కు అప్పగించాడు.
హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన టి.ఆకాశ్ 2013లో దొంగతనాలు చేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు తిరిగి దొంగతనాలు మొదలు పెట్టాడు. దొంగిలించిన బైక్లను విక్రయించేందుకు జడ్చర్లలో నివాసముంటున్న మహ్మద్ సోహెల్తో ఒప్పందం చేసుకున్నాడు. ఆకాశ్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి, వాటిని సోహెల్కు అప్పగించాడు. చోరీ వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.