హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను 22వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించాలని వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బీఆర్కే భవన్లో కమిటీ చైర్మన్ డాక్టర్ కేశవరావు అధ్యక్షతన గురువారం కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కేవీ రమణాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రారంభమైన వజ్రోత్సవాలకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, అదే మాదిరిగా 22న ఎల్బీ స్టేడియంలో ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని అన్నారు.
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి బృందంతో దీపాంజలి సాంసృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ బృందంతో దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో ఉంటుందని వివరించారు. నేటి రక్షా బంధన్ను కూడా జాతీయ స్ఫూర్తిని నింపేలా నిర్వహించుకోవాలని ప్రజలకు కమిటీ పిలుపునిచ్చింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘భారతదేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు నా శక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తాను’అని ప్రతిజ్ఞ చేయనున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలుగు టీవీ చానళ్లకు రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ గురువారం లేఖ రాశారు. ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక లోగోకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న నాగార్జునసాగర్లోని బుద్ధవనం(బౌద్ధవారసత్వ ఉద్యానం)ను పర్యాటకులు ఉచితంగా సందర్శించవచ్చని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బౌద్ధసంస్కృతి, తెలుగు రాష్ర్టాల్లో విలసిల్లిన బౌద్ధ శిల్పకళ, బుద్ధుని జీవిత ఘట్టాలు, శ్రీలంక బుద్ధుని శిల్పం, దక్షిణాసియా, దేశీయ బౌద్ధ స్థూపాల నమూనాలు, అశోకుని ధర్మ చక్రం, ఆచార్య నాగార్జునుడి శిల్పాలు బుద్ధవనంలో ఉన్నాయని వివరించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరింది. అందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు గురువారం ఆదేశాలను జారీ చేసింది.