హయత్నగర్, డిసెంబర్ 17: హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ విలేజీ, జీ స్కూల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతుండటంతో పలు వాహనదారులు ఓల్డ్ విలేజ్ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నారు. జీస్కూల్ చౌరస్తా వద్ద కొంత కాలంగా ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా సకాలంలో ఆఫీసులకు, గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో పక్కనే జీస్కూల్కు చెందిన బస్సులు వచ్చి వెళ్తుండటతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చౌరస్తా వద్ద వాటర్ వర్క్స్ మంచినీటి పైపులు పలుమార్లు లీకేజీలు వస్తుండటంతో కూడా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. మున్సిపల్, వాటర్ వర్క్స్ అధికారులు జీస్కూల్ చౌరస్తా వద్ద పకడ్బందీగా పైపులైన్ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులకు కలుగకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు జీస్కూల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.