సిటీబ్యూరో/మేడ్చల్ , జూన్ 19 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించడం.. తదితర వాటికే ఇంతకాలం పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు తాజాగా.. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం అడ్డుకట్ట వేసే దిశగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈనెల 17వ తేదీ రాత్రి మేడ్చల్ చెక్పోస్ట్ ప్రాంతంలో మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వస్తున్న స్కార్పియో వాహనాన్ని ఆపేందుకు యత్నించగా.. వాహనంలోని వ్యక్తులు పోలీసులను చూసి స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.
దీంతో అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో 150కిలోల గంజాయి బయటపడింది. వాహనంతోపాటు 150 కిలోల గంజాయి, నిందితులకు సంబంధించిన ఒక సెల్ఫోన్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మేడ్చల్ శాంతిభద్రతల పోలీసులకు అప్పగించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ పెద్ద మొత్తంలో గంజాయి రవాణాను అడ్డుకున్న మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.