వేసవి సెలవులు ముగియడంతో సోమవారం బడిగంట మోగనుంది. ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్ పరిధిలో 17ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు 47 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తొలిరోజునుంచే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను సరిదిద్దేందుకు పక్కా ప్రణాళిక రూపొందించిన అధికారులు సుమారు 28వేల పుస్తకాలను ఇప్పటికే ఆయా స్కూళ్లకు పంపించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వందశాతం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లు ఆదేశాలు జారీ అయ్యాయి.
బంజారాహిల్స్,జూన్ 11
స్కూళ్లకు తుది మెరుగులు..
నూతన విద్యాసంవత్సరంలో భాగంగా సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండడంతో మనబస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని షేక్పేట మండల పరిధిలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు కోటిన్నర వ్యయంతో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నారు. వీటిలో భాగంగా అదనపు తరగతి గదులు, టాయ్లెట్స్ నిర్మాణాలు, ప్రహరీల నిర్మాణం, పాడైపోయిన గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న మరమ్మతు పనులను యుద్ధ్ద ప్రాతిపదికన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో రంగులు వేస్తుండగా మరికొన్ని పాఠశాలల్లో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు.