చార్మినార్, అక్టోబర్ 28: పాతబస్తీలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న హవాలా నగదును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన గంటయాల శ్రీనివాస్రావు (60) శ్రీశైలంగౌడ్(50)తోపాటు న్యూబోయిన్పల్లి ప్రాంతానికి చెందిన సురేశ్ (28) కలిసి రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. నిందితులపై విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు ప్రయాణిస్తున్న వాహనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు.
ముగ్గురు నిందితులు సామగ్రి తరలించే సంచుల్లో రూ.10లక్షల చొప్పున మూడు వేర్వేరుగా రూ.30లక్షల నగదును తరలిస్తున్నారని గుర్తించారు. నిందితుల వద్ద ఎలాంటి రసీదు కాని, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించే ఎలాంటి పత్రాలులేవని వెల్లడించారు. నగదును ఎక్కడి నుంచి సేకరించారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం సైతం అందించకపోవడంతో హవాలా నగదుగా గుర్తించామని ఇన్స్పెక్టర్ అయజ్కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదుతోపాటు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం రెయిన్బజార్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.