ఖైరతాబాద్, మే 25 : రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని, విశ్వవిద్యాలయంపై ఇక కేంద్రంపై పోరు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డి. శ్రీను నాయక్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం గిరిజన విద్యార్థి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని ఖండించారు. 2014 విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేటాయించాల్సి ఉందని, అయితే ఏపీలో యూనివర్సిటీని 2019లోనే కేంద్రం ప్రారంభించిందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కనీసం ఆ ప్రక్రియ కూడా ప్రారంభించలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో 335 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దాదాపు ఏడు సంవత్సరాలు గడస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని గిరిజనుల సమస్యలైనా తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం, పది శాతం రిజర్వేషన్లు కల్పించడం, పోడు భూమి పట్టాల పంపిణీ, నగర నడిబొడ్డున గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బంజారా, ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టారన్నారు.
సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాన మంత్రిని కలిసి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారని, కానీ, కేంద్రం పూర్తిగా గిరిజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. గిరిజన యూనివర్సిటీ ప్రారంభించాలని, పది శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించాలని గిరిజన విద్యార్థులు ప్రధానికి లేఖలు రాస్తే కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో నరేశ్ నాయక్, కుర్ర వంశీ నాయక్, సంగీత నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.