చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆధుకుంటుందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సంస్థ అధోగతి పాలు అవుతుందని వివరించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎంయూ జనరల్ బాడీ సమావేశంను నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం. థామస్ రెడ్డి మాట్లాడారు.
ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలని, కార్మికుల సంక్షేమం కోసం సంపూర్ణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. సమ్మెల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, సంధి ద్వారానే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.. తాము ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. యూనియన్ల జేఏసీ వల్ల ఎలాంటి ఫలితం లేదని, దీనికి గత అనుభవాలే నిదర్శనం అన్నారు.
యూనియన్లే లేనప్పుడు జేఏసీ ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. టీఎంయూకి 70 శాతం మంది కార్మికుల మద్దతు ఉందని చెప్పారు. టీఎంయూకి ప్రభుత్వ సహకారం ఉందని ఆయన వెల్లడించారు.దీని మూలంగానే మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయిలను కేటాయించడం జరిగిందని తెలిపారు.
కార్మికులు సీఎస్పీ,పీఎఫ్ పెన్షన్ లాంటి సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోగలగమని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా టీఎంయూకు గుర్తింపు హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెలీ కవిత సహకారంతో సమస్యల పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతామని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.కమలాకర్ గౌడ్, సంయుక్త కర్యాదర్శి నరేందర్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జీపీఆర్ రెడ్డి,అడ్వైజర్ ఎల్.మారయ్య, యాదయ్య, నరేందర్, జి.ఎల్ గౌడ్, బి.నరేందర్, గంగాధర్, నర్సింహ, ఆర్.ఆర్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.