Crime News | జవహర్నగర్, ఫిబ్రవరి 2 : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడికి డబ్బులిచ్చి భర్తను దారుణంగా హత్య చేయించి, పెట్రోల్ పోసి కాల్చివేసిన సంఘటనలో జవహర్నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారం తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్లోని ముత్తుస్వామి కాలనీకి చెందిన సందరి స్వామి(35) డ్రైవర్. అతడికి భార్య కావ్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే అదే కాలనీలో నివాసముండే డ్రైవర్ ప్రణయ్కుమార్ అలియాస్ ప్రణయ్తో కావ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భర్తకు తెలియకుండా తన వద్ద ఉన్న ఆరు తులాల బంగారం, యాప్ల నుంచి లోన్లు తీసుకొని దఫదఫాలుగా రూ.8 లక్షలు ప్రియుడికి ఇచ్చింది. ఈ వ్యవహారం భర్త స్వామికి తెలియడంతో మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొదించాలని ప్లాన్ చేసింది. ఖర్చుల నిమిత్తం ప్రణయ్కి రూ.43 వేలు ఇచ్చి ఈ నెల 26న ముహూర్తం ఖరారు చేసింది. ఇదిలా ఉండగా స్వామిని కలిసిన ప్రణయ్ రెండు రోజులు కూలీ ఇస్తాను.. డ్రైవర్గా నిజామాబాద్కు రావాలని కోరాడు. ఇద్దరూ కలిసి నిజామాబాద్కు చేరుకున్నారు. అక్కడ ప్రణయ్ స్నేహితుడైన పసుపులేని రోహిత్ను కలిశారు. 26వ తేదీ రాత్రి స్థానికంగా ఉన్న ఓ వెంచర్లో మద్యం సేవించారు. స్వామి మత్తులోకి జారుకున్న తర్వాత కారు ముందు సీట్లో కూర్చోబెట్టిన ప్రణయ్, రోహిత్ అతడిని కత్తితో పొడిచి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తిరిగి జవహర్నగర్లోని వికలాంగుల కాలనీ కౌకుర్ అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ మరో స్నేహితుడు మబ్బు నగేశ్ సహాయంతో జనవరి 27న ఉదయం స్వామి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు.
28వ తేదీన ఆటవీ ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు కోసం వెంటనే 10 బృందాలను రంగంలోకి దింపారు. మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్ నేతృత్వంలోని బృందం అక్కడ సీసీ కెమెరాలను విశ్లేషించారు. ఈ దారిలో రెండు మూడు కార్లు వచ్చిపోయినట్లు తేలింది. ఘటన స్థలంలో కారు టైర్ల అచ్చులను పరిశీలించిన పోలీసులు.. ప్రణయ్ కిరాయికి నడుపుతున్న కారుగా గుర్తించారు. దీంతో ప్రణయ్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రియుడు ప్రణయ్, అతడి స్నేహితులు రోహిత్, మబ్బు నగేశ్లను అరెస్టు చేశారు.
భర్తను హత్య చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు కావ్య ప్రణయ్ ద్వారా లైవ్గా తెలుసుకున్నది. నిజామాబాద్లో మద్యం సేవించి నిద్రపోతున్నాడని, ఆ తర్వాత కత్తులతో చంపేశామంటూ ప్రణయ్ చెబుతూ వచ్చాడు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కాల్చేస్తున్న సమయంలోనూ ప్రణయ్, తన ప్రియురాలితో విషయాలు అప్డేట్ చేస్తూ వచ్చాడు. అయితే తన భర్తను హత్య చేయించేందుకు రూ.43 వేలు ప్రణయ్కి గూగుల్ పేలో కావ్య పంపించింది.