సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మేర జీహెచ్ఎంసీ పరిధిలోనే జరుగుతుండటం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతున్నది. అందులో ముంబాయి తరహాలో ఆకాశమే హద్దుగా ఆకాశహర్మ్యాలు నగర అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో కొత్తగా 16,114 నిర్మాణాలను జీహెచ్ఎంసీ మంజూరు చేయగా, వీటి నుంచి రూ.1056.37 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. నిర్మాణ రంగ అనుమతుల్లో భాగంగా 30 అంతస్తులకు మించి 14 హైరైజ్డ్ బిల్డింగ్లు ఉండడం గమనార్హం. అత్యధికంగా వెస్ట్జోన్ (శేరిలింగంపల్లి)లో అనుమతులు ఇచ్చారు. 60 హైరైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రాగా, 22 హై రైజ్డ్ కమర్షియల్ బిల్డింగ్లు వచ్చాయి. వీటికి తోడుగా 16 చోట్ల గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్లకు అనుమతులు ఇచ్చారు. శేరిలింగంపల్లి జోన్లో గ్రౌండ్+47 అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణ అనుమతులన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్తో నిర్మాణ రంగ అనుమతులు సులభతరం అయ్యాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
75 గజాల్లోపు ఇండ్లకు రూ.1కే నిమిషాల్లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్తో అనుమతి పొందుతున్నారు. 1921 దరఖాస్తులు రిజిస్ట్రర్ కాగా, 716 మాత్రమే ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్కు అర్హత సాధించాయి. 993 దరఖాస్తులను తిరస్కరించారు.
ప్రధానంగా 75 నుంచి 500 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. 11,088 ఇన్స్టంట్ అప్రూవల్కు అర్హత సాధించాయి.
ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీలో భాగంగా 1314 దరఖాస్తులు స్వీకరించగా, 876 ఓసీలను మంజూరు చేశారు. 390 తిరస్కరణకు గురికాగా, 48 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
500 చదరపు మీటర్ల కంటే ఎకువ ప్లాట్ ఏరియా, లేదా 10 మీటర్ల కంటే ఎకువ ఎత్తు ఉన్న అన్ని నివాస భవనాలు మరియు అన్ని నివాసేతర భవనాలు (ఎత్తైన భవనాలు, సమూహ అభివృద్ధి పథకాలు, అపార్ట్మెంట్ సముదాయాలు, మల్టీప్లెక్స్లు, నివాసేతర భవనాలు) మరియు లేఅవుట్లకు 21 రోజుల వ్యవధిలో అనుమతులు ఇస్తున్నారు. ఈ కేటగిరిలో 1920 నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు.
ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ, లింకు రోడ్లు, అభివృద్ధి ఏదైనా ఒక్క భూసేకరణకే ఏళ్ల తరబడి సమయం పట్టేది. ఇదంతా ఉమ్మడి రాష్ట్ర పాలనలో. కానీ స్వరాష్ట్రంలో ప్రాజెక్టు రూపకల్పన జరిగిందే తడవుగా మాసాల వ్యవధిలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నది. దీనికి ఒకే ఒక్క కారణంగా 2017 సంవత్సరంలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన ‘టీడీఆర్’ పాలసీ. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాలకై చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో సత్తా చాటుతున్నది. 2017 నుంచి డిసెంబరు 30, 2022 నాటికి దాదాపు 4వేల కోట్ల విలువైన 1788 టీడీఆర్లను అందజేసింది. ఒక్క ఈ ఏడాదిలోనే 483 టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.